వెంటాడిన మృత్యువు.. ముగ్గురి దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-12T21:01:10+05:30 IST
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు అంటారు.. ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. కారు పంక్చర్ అయిందని దిగి రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తుల్ని ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా
ఉత్తరప్రదేశ్: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు అంటారు.. ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. కారు పంక్చర్ అయిందని దిగి రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తుల్ని ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటావా హైవేపై ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కారులో న్యూఢిల్లీ నుంచి జాన్సీ బయలుదేరారు. జాతీయ రహదారి 2 వద్దకు రాగానే ఓ దాబా వద్ద వాళ్ల కారు పంక్చర్ అయింది. దీంతో వాళ్లు కారులో నుంచి దిగి రోడ్డు పక్కన కూర్చున్నారు. అంతలోనే అక్కడికి దూసుకొచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.