వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-08-01T05:59:53+05:30 IST

జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంతబొమ్మాళి మండలంలో బస్సు ఢీకొని యువకుడు, ఇచ్ఛాపురంలో స్కూటీ నుంచి జారిపడి మహిళ, లావేరు మండలంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
సరస్వతి(ఫైల్‌):

 ముగ్గురికి గాయాలు

జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంతబొమ్మాళి మండలంలో బస్సు ఢీకొని యువకుడు, ఇచ్ఛాపురంలో స్కూటీ నుంచి జారిపడి మహిళ, లావేరు మండలంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

బస్సు ఢీకొని యువకుడు..

సంతబొమ్మాళి/నందిగాం, జూలై 31: సంతబొమ్మా ళి మండలం యామలపేట- హనుమంతునాయుడుపేట సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని పిట్ట లక్ష్మీపతి(21) అనే యువకుడు దుర్మరణం చెందాడు.  పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నందిగాం మండలం కవిటిఅగ్రహారం గ్రామానికి చెందిన లక్ష్మీపతి.. తన అక్క కక్కర జ్యోతితో కలిసి ద్విచక్ర వాహనంపై పోతునా యుడుపేట వైపు వెళ్తున్నాడు. యామలపేట-హనుమంతునాయుడుపేట సమీ పంలో వీరి వాహనాన్ని నౌపడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో లక్ష్మీపతి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న జ్యోతి ముళ్లపొదల్లోకి తుళ్లిపోవడంతో స్వల్ప గాయాలతో బయట పడింది. సంఘటనా స్థలాన్ని నౌపడ ఎస్‌ఐ సాయికుమార్‌ పరిశీలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తండ్రి మృతి చెందిన ఏడాదికే..

లక్ష్మీపతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మీపతి తండ్రి చిన్నారావు గత ఏడాది ఆగస్టులో అనారోగ్యంతో మృతిచెందాడు. ఇంకా ఆ విషాదాన్ని మరచిపోకముందే కుమారుడు రహదారి ప్రమాదంలో మృతిచెందా డని తెలిసి తల్లి రమణమ్మ, ఇతర కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తు న్నారు. తనకు ఇక దిక్కెవరంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.  

  ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి మహిళ..

ఇచ్ఛాపురం: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడిన ఓ మహిళ మీద నుంచి లారీ వెళ్లడంతో ఆమె దుర్మరణం చెందింది. పోలీసుల కథనం మేరకు...కవిటి మండలం  ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన బోరుభద్ర సరస్వతి(45) తన  కుటుంబ సభ్యులతో కొంతకాలంగా ఒడిశాలోని బరంపురంలో ఉంటోంది. ప్రగడపుట్టుగలో బంధువుల ఇంటికి శుక్రవారం వచ్చింది. శనివారం మధ్యాహ్నం ప్రగడపుట్టుగ నుంచి తన కు మార్తె స్వాతితో కలిసి  స్కూటీపై  బరంపురం బయలుదేరింది. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద స్కూటీ వెనుక కూర్చొన్న సరస్వతి జారిపోయి రోడ్డుపై పడింది. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ సరస్వతిపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడకక్కడే మృతి చెందింది.  డ్రైవింగ్‌ చేస్తున్న స్వాతి కూడా మరోపక్కకు పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. స్వాతికి ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో బరంపురం తరలించారు. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదుచేశారు. సరస్వతికి భర్తతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమారై ఉన్నారు. 

లారీ ఢీకొని ఒకరు..

లావేరు: మండలంలోని రావివలస వద్ద గల జాతీయ రహదారిపై లారీ ఢీకొని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. రమణతో పాటు మరోవ్యక్తి గోవింద ద్విచక్ర వాహనంతో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో రమణ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద గాయపడ్డాడు. ఇతనిని 108 వాహనంలో  శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


Updated Date - 2021-08-01T05:59:53+05:30 IST