3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికల Bypolls ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-30T12:47:00+05:30 IST
దేశంలోని మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది....
న్యూఢిల్లీ : దేశంలోని మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయుధ పోలీసు పహరా మధ్య ప్రారంభమైన పోలింగులో పాల్గొనేందుకు కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ, మధ్యప్రదేశ్ లోని ఖండ్వా, దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీల మృతితో ఖాళీ అయిన మూడు లోక్ సభ స్థానాల్లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. మండీ ఎంపీ రాంస్వరూప్ శర్మ, ఖాండ్వా ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ మార్చిలో మరణించారు. దాద్రా ఎంపీ మోహన్ డెల్కర్ ఒక నెల క్రితం ఆత్మహత్యతో చేసుకున్నారు.దీంతో మూడు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ సాగుతోంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూచ్ బెహార్, శాంతిపూర్, ఖర్దా, గోసాబా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.అస్సోంలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొక్రాఝర్ జిల్లాలోని గోస్సైగావ్, బక్సా జిల్లాలోని తముల్పూర్, జోర్హాట్ జిల్లాలోని మరియాని, తౌరా, బార్పేట జిల్లాలోని భవానీపూర్ స్థానాల్లో పోలింగ్ షురూ అయింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో గోసాయిగావ్, తముల్పూర్ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రాజీనామా చేశారు.
ఖాండ్వా లోక్సభ స్థానంతో పాటు, మధ్యప్రదేశ్లో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్గావ్, జోబాట్, పృథ్వీపూర్ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభం అయింది.తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది.