ఆయనకు ముగ్గురు... ఇంట్లోనివారికి ఈ సంగతి తెలియడంతో...

ABN , First Publish Date - 2021-09-29T17:13:56+05:30 IST

మన చుట్టుపక్కల, సినిమాల్లో, నవలల్లో...

ఆయనకు ముగ్గురు... ఇంట్లోనివారికి ఈ సంగతి తెలియడంతో...

మన చుట్టుపక్కల, సినిమాల్లో, నవలల్లో అనేక ప్రేమకథలను చూస్తుంటాం... వింటుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో వెలుగు చూసిన ప్రేమకథను ఎక్కడా వినివుండం. ఈ కథను విన్నవారంతా ఆశ్చర్యంగా నోరెళ్లబెడుతున్నారు. వరుసకు అక్కాచెల్లెళ్లయిన ముగ్గురు యువతులు ఒకే యువకునిపై మనసు పారేసుకున్నారు. ఈ సంగతి వారి ఇళ్లలోని వారికి తెలిసి, వారు వ్యతిరేకించడంతో ఆ ముగ్గురు ప్రియురాళ్లు, ఏకైక ప్రియుడు గ్రామం నుంచి మాయమయ్యారు. 


ఈ ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం అజీమ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం ఇక్కడి ఒక గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి ఇంటిలోని వారికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో ఆ మూడు కుటుంబాల వారు ఆ యువతుల కోసం తమకు అనుమానం ఉన్న అన్నిచోట్లా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే వారు ముగ్గురు కలిసి ఒక యువకునితో పాటు వెళ్లిపోయారని గ్రామంలోని వారికి తెలిసింది. ఆ ముగ్గురు యువతులలో ఇద్దరు మైనర్లని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ముగ్గురు యువతుల కోసం వారి కుటుంబ సభ్యులు ఇంకా గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారమిస్తే ఎక్కడ పరువుపోతుందోననే భయంతో వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఈ ఉదంతం గురించి అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆ ముగ్గురు యువతుల అదృశ్యం గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వారు కంప్లైంట్ చేస్తే తాము వారికి సహకారం అందిస్తామన్నారు.

Updated Date - 2021-09-29T17:13:56+05:30 IST