హాల్‌ టికెట్‌కోసం బయలుదేరి తిరిగిరాని లోకాలకు..

ABN , First Publish Date - 2021-04-03T17:46:19+05:30 IST

పరీక్ష హాల్‌ టికెట్‌ తెచ్చుకునేందుకు వెళుతూ ముగ్గురు ..

హాల్‌ టికెట్‌కోసం బయలుదేరి తిరిగిరాని లోకాలకు..

నల్గొండ/హాలియా : పరీక్ష హాల్‌ టికెట్‌ తెచ్చుకునేందుకు వెళుతూ ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. హాలియా మునిసిపాలిటీలోని అనుములకు చెందిన బొడ్డుపల్లి మహేష్‌(17), పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మాధవరపు శివచౌదరి(17), గుర్రంపోడు మండలం నడ్డివారిగూడేనికి చెందిన నడ్డి శ్రీకాంత్‌(17)లు ఐదో తరగతి నుంచి స్నేహితులు. నల్లగొండలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ ముగ్గురు హాల్‌టికెట్‌ తెచ్చుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌ ద్విచక్రవాహనంపై నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో చింతగూడెం సమీపంలో నల్లగొండ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ బైక్‌ను వేగంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.


చిన్ననాటి స్నేహితులైన ఈ ముగ్గురు హాలియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నాన్నారు. అనంతరం ముగ్గురు కలిసి నల్లగొండలోని గౌతమి కళాశాలలో ఇంటర్‌లో చేరారు. మృత్యువులో సైతం వీరి స్నేహబంధం కొనసాగిందని స్థానికులు కంటతడి పెట్టారు. అనుములకు చెందిన బొడ్డుపల్లి మహేష్‌ ఏకైక కుమారుడు  కావడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరరాఘవులు, ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-03T17:46:19+05:30 IST