ముగ్గురు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-09-19T04:36:12+05:30 IST

మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కన్నెపల్లి సత్తయ్య, దుర్గారాజ్‌ల మృతికి కారణ మైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌ తెలిపారు.

ముగ్గురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కరుణాకర్‌

కాగజ్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 18: మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కన్నెపల్లి సత్తయ్య, దుర్గారాజ్‌ల మృతికి కారణ మైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌ తెలిపారు. శనివారం ఈసుగాం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టు చూపారు.  ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. వన్యప్రాణుల వేట కోసం సత్తయ్య, దుర్గారాజ్‌లు వెళ్లారని చెప్పారు.  కాగా అదే విధంగా వేటాడే విలేజ్‌ నంబరు.6కు చెందిన అనూప్‌కుమార్‌ బిస్వాస్‌, సంజయ్‌ సర్కార్‌, హరిపద హల్దార్‌లు వన్యప్రాణుల కోసం విద్యుత్‌ తీగల అమర్చారని అన్నారు. అది గమనించని సత్తయ్య, దుర్గారాజ్‌లు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందారని అన్నారు. ఎవరికి అనుమానాలు రాకుండా ఉండేందుకు గాను సమీపంలోని మామిడితోటలో వారి మృతదేహాలను పూడ్చి వేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు సత్తయ్య, దుర్గారాజ్‌ల కోసం గాలించగా మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు  విచారణ చేపట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.  సమావేశంలో రూరల్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్సై సందీప్‌కుమార్‌, పీఎస్సై లావణ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:36:12+05:30 IST