రూ. 2,000 కోట్లతో మూడు టెక్‌ పార్కులు

ABN , First Publish Date - 2021-04-11T06:13:19+05:30 IST

కొవిడ్‌ ప్రభావంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌)ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో కార్యాలయానికి వచ్చి పని చేసే సంస్కృతి తిరిగి వస్తుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు భావిస్తున్నాయి

రూ. 2,000 కోట్లతో మూడు టెక్‌ పార్కులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ ప్రభావంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌)ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో కార్యాలయానికి వచ్చి పని చేసే సంస్కృతి తిరిగి వస్తుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు భావిస్తున్నాయి. డబ్ల్యూ ఎఫ్‌హెచ్‌ వల్ల ఐటీ కంపెనీల ఉత్పాదకతకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో మరిన్ని బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నాయి. ఇందుకు అనుగుణంగా కొత్త టెక్‌ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి.  దాదాపు రూ.2,000 కోట్లతో వంశీరామ్‌ బిల్డర్స్‌ మూడు టెక్‌ పార్కులను అభివృద్ధి చేస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ జిల్లాలో జ్యోతి టెక్‌ పార్కు పేరుతో 16.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని, ఎస్‌డీ టెక్‌ పార్కు పేరుతో 11 లక్షల చ.అ కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నామని వంశీరామ్‌ బిల్డర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌బీ రెడ్డి తెలిపారు. జ్యోతి గ్రాన్యూల్స్‌ పేరుతో కొండాపూర్‌లో 6.5 లక్షల చ.అ టెక్‌  పార్కును కూడా చేపట్టింది. ఇవన్నీ నాన్‌ ఎస్‌ఈజెడ్‌ ప్రాజెక్టులే. ఐటీ పార్కుల అభివృద్ధిలో భాగంగా సోహినీ టెక్‌ పార్కు పేరుతో ఐటీ పార్కును కంపెనీ అభివృద్ధి చేసింది. ఇందులో మైక్రోసాఫ్ట్‌, వన్‌ప్లస్‌ వంటి కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.


 ‘బీఎ్‌సఆర్‌ ఐటీ ఎస్‌ఈజెడ్‌’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో బ్లాక్‌-1 ను పూర్తి చేశామని, ఇందులో మెడ్‌ట్రానిక్‌ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో 15 లక్షల చ.అ కార్యాలయ స్థలం ఉండగా.. 1.5 లక్షల చ.అ స్థలంలో మెడ్‌ట్రానిక్‌ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సేవల  రంగంలోని మరో బహుళ జాతి కంపెనీ కూడా కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. మరిన్ని బహుళ జాతి కంపెనీలు కార్యాలయ స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్లు ఎస్‌బీ రెడ్డి తెలిపారు. 13 లక్షల చ.అ కార్యాలయ స్థలంతో బ్లాక్‌-2ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. థీమ్‌ ఆధారిత రెసిడెన్షియల్‌ టౌన్‌షి్‌పలు, కమర్షియల్‌ ప్రాజెక్టులను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. 

Updated Date - 2021-04-11T06:13:19+05:30 IST