పారిశ్రామిక ప్రాంతంలో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు
ABN , First Publish Date - 2021-06-20T04:57:15+05:30 IST
పారిశ్రామిక ప్రాంతంలో మూడు చోట్ల వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించనున్నారు.
ఏకేసీ కాలనీ, ములగాడ, ములగాడ హౌసింగ్ కాలనీల్లో ఏర్పాటు
ఒక్కో సెంటర్ నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయింపు
వచ్చే నెలలో పనులు ప్రారంభమయ్యే అవకాశం
మల్కాపురం, జూన్ 19 : పారిశ్రామిక ప్రాంతంలో మూడు చోట్ల వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించనున్నారు. 40వ వార్డు ఏకేసీ కాలనీ, 58వ వార్డు ములగాడ, 59వ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీలలో ఈ హెల్త్ సెంటర్లను నిర్మించేందుకు అధికారులు స్థలాలను గుర్తించారు. హెల్త్ సెంటర్లను నిర్మించే స్థలాలు ప్రభుత్వానివేనని రెవెన్యూ అధికార యంత్రాంగం గుర్తించిన తరువాత స్థానిక అధికారులు ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఉన్నతాధికారులు ఈ స్థలాలను పరిశీలించారు. ఒక్కో ఆస్పత్రిని 3,640 చదరపు అడుగులలో నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.80 లక్షలు కేటాయించింది. ఈ ఆస్పత్రుల నిర్మాణ పనులు జూలైలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజల ముంగిటకు వైద్యసేవలు వచ్చినట్టే. పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం ఏడు వార్డుల ప్రజలకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఎదురుగా ఉన్న జీవీఎంసీ ఆస్పత్రి ఒక్కటే ఉంది. అలాగే మల్కాపురం, ఇందిరాకాలనీలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దీని వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు అవసరమని సంబంధిత అధికారులు గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి పనులను వేగవంతం చేశారు.
స్థల పరిశీలన
59వ వార్డు ములగాడలో నిర్మించనున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ స్థలాన్ని జీవీఎంసీ జోన్ 4 ఈఈ రత్నాలరాజు, డీఈ ఏడుకొండలు, స్థానిక ఏఈ సత్యనారాయణ శనివారం పరిశీలించారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నామని వారు తెలిపారు. వారి వెంట వార్డు జీవీఎంసీ సిబ్బంది, కార్పొరేటర్ గులిగిందల లావణ్య ఉన్నారు.