11 నిమిషాల ట్రిప్ కోసం రూ. 205కోట్లు !
ABN , First Publish Date - 2021-06-13T19:36:01+05:30 IST
అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ జూలై 20న తన సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ తయారు చేసిన న్యూ షెపర్డ్ రాకెట్లో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారనే విషయం తెలిసిందే.
న్యూయార్క్: అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ జూలై 20న తన సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ తయారు చేసిన న్యూ షెపర్డ్ రాకెట్లో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారనే విషయం తెలిసిందే. బెజోస్తో పాటు ఆయన సోదరుడు మార్క్ బెజోస్ కూడా ఈ యాత్రకు వెళ్తున్నారు. కాగా, బ్లూ ఆరిజిన్ సంస్థ బెజోస్తో కలిసి 11 నిమిషాల స్పేస్ ట్రిప్ వేయడానికి రాకెట్లోని ఓ సీటును వేలం వేసింది. గత నెల 5వ తేదీ నుంచి దీనికోసం బిడ్లను ఆహ్వానించింది. దీంతో 159 దేశాలకు చెందిన సుమారు 7వేల మంది ఔత్సాహికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక శనివారం నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి ఆ సీటును ఏకంగా 28 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో సుమారు 205కోట్లు) దక్కించుకోవడం విశేషం.
కేవలం 4.8 మిలియన్ డాలర్ల నుంచి ప్రారంభమైన వేలం.. ఏకంగా 28 మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం. కాగా, వేలంలో ఇంత భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న ఆ వ్యక్తి వివరాలను మాత్రం బ్లూ ఆరిజిన్ బయటకు చెప్పలేదు. జూలై 20న బెజోస్ సోదరులతో కలిసి ఆ వ్యక్తి కూడా న్యూ షెపర్డ్ రాకెట్లో 11 నిమిషాల స్పేస్ ట్రిప్కు వెళ్తారని మాత్రం బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. ఇక బ్లూ ఆరిజిన్ మీద మరింత ఫోకస్ పెట్టేందుకే జూలై 5న అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే జెఫ్ బెజోస్ ప్రకటించారు. అదే రోజు బెజోస్ స్థానంలో ఆండీ జాస్సీ అమెజాన్ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.