గిన్నిస్‌ రికార్డు కెక్కిన భారత్‌లో పులుల లెక్కింపు ప్రక్రియ

ABN , First Publish Date - 2020-07-11T23:41:31+05:30 IST

అంతర్జాతీయ పులల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘అఖిలభారత పులుల లెక్కింపు-2018’ నాలుగో దశ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వేగా గిన్నిస్‌రికార్డు సృష్టించింది.

గిన్నిస్‌ రికార్డు కెక్కిన భారత్‌లో పులుల లెక్కింపు ప్రక్రియ

హైదరాబాద్‌: అంతర్జాతీయ పులల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘అఖిలభారత పులుల లెక్కింపు-2018’ నాలుగో దశ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వేగా గిన్నిస్‌రికార్డు సృష్టించింది. ఇదొక గొప్ప క్షణం...ఆత్మనిర్బర్‌ భారత్‌కు ప్రకాశవంతమైనది అంటూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌జవడేకర్‌ ట్వీట్‌చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుండే సంకల్ప్‌ సే సిద్ధిగా ఆయన అభివర్ణించారు. పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని చేసిన తీర్మానాన్ని,లక్ష్యానికి నాలుగేళ్ల ముందే నిలబెట్టుకున్నామని జవడేకర్‌ చెప్పారు. కొత్తలెక్కల ప్రకారం భారత దేశంలో 2967 పులులు ఉన్నాయన్నారు. దీంతో ప్రపంచంలో ఉన్న పులుల్లో 75శాతం భారత్‌లోనే ఉన్నాయని ఆయన వివరించారు. 2022 నాటికి దేశంలో పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 2010లో తీర్మానించామని, 


ఆ లక్ష్యానికి నాలుగేళ్ల ముందే దానిని సాధించామని చెప్పారు. వనరు, సమాచార పరంగా 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో దశ చాలా సమగ్రమైనది. 141 ప్రాంతాల్లోని 26,838 చోట్ల కెమెరాలు ట్రాప్‌లు (మోషన్‌సెన్సార్లతో అమర్చిన కెమెరాలు, జంతువు ఆ పరికాల ఎదుట నుంచివెళుతున్నప్పుడు ఫోటో తీస్తాయి) అమర్చారు. 1,21,337 చ.కి.మీ. (46,848 చ.మై) విస్తీర్ణంలో సర్వే జరిగింది.  కెమెరా ట్రాప్‌లు మొత్తం 3,48,58,623 ఫోటోలు (వీటిలో 76,651 పులులు, 51,777 చిరుతలు, మిగిలినవి ఇతర జంతుజాలం) తీశాయి. వీటి నుంచి 2,461 పులులను (పులికూనలుకాక) చారలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించారని గిన్నీస్‌బుక్‌సైట్‌లో రాశారు.


వన్య ప్రాణుల సంస్థ సాంకేతిక సాయంతో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ యంత్రాంగం పులుల జనాభా లెక్కింపు చేపడుతుంది. రాష్ట్ర అటవీ శాఖలు, వాటి భాగస్వాములు ఈ గణన చేపడతాయి. ప్రపంచవ్యాప్తంగా 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలు, మన దేశంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ కార్యక్రమానికి సాటిరాలేదు. పులుల సంరక్షణలో భారత్‌ అగ్రస్థానంలో వుంది. భారత్‌ చేపట్టిన చర్యలను బంగారు ప్రమాణాలుగా ప్రపంచం భావిస్తోంది. 

Updated Date - 2020-07-11T23:41:31+05:30 IST