భారత్‌లోకి మళ్లీ వచ్చేస్తున్న టిక్‌టాక్!

ABN , First Publish Date - 2020-11-14T02:59:31+05:30 IST

భారత్‌లో నిషేధానికి గురైన ‘పబ్‌జీ మొబైల్’ దేశంలో మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు షార్ట్ వీడియో షేరింగ్ యాప్

భారత్‌లోకి మళ్లీ వచ్చేస్తున్న టిక్‌టాక్!

న్యూఢిల్లీ: భారత్‌లో నిషేధానికి గురైన ‘పబ్‌జీ మొబైల్’ దేశంలో మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌ టాక్ కూడా భారత్‌లో మళ్లీ కాలు మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఉద్యోగులకు రాసిన లేఖతో ఈ విషయం తేటతెల్లమైంది. గోప్యత, భద్రత పరమైన చర్యలు చేపట్టిందని, దేశంలో తిరిగి ప్రవేశానికి ఇది సానుకూల అంశమని ఉద్యోగులకు రాసిన లేఖలో నిఖిల్ గాంధీ పేర్కొన్నారు. భారత్‌లో తిరిగి అడుగిడ బోతున్నట్టు పబ్‌జీ మొబైల్ నిన్ననే (గురువారం) ప్రకటించింది. 24 గంటలు కూడా గడవకముందే ఇప్పుడు టిక్‌టాక్ కూడా ఇటువంటి ప్రయత్నాలు ప్రారంభించింది.


చైనా బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్.. డేటా గోప్యత, భద్రత వంటి వాటి విషయంలో స్థానిక చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. భారత్‌లో టిక్‌టాక్‌ అభివృద్ధికి ఇదో గొప్ప అవకాశమని గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. పూర్తి స్పష్టతతో కూడిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని గాంధీ తెలిపారు. ఉద్యోగులతో కలిసి తిరిగి వినియోగదారులు, క్రియేటర్లకు అంకితమవుతామని వివరించారు.


భారత ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో వియ్ చాట్, యూసీ బ్రౌజర్, టిక్‌టాక్ సహా 58 యాప్స్‌ను నిషేధించింది. ఈ యాప్స్ దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత వంటి వాటి విషయంలో ప్రమాదకరంగా మారాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. 

Updated Date - 2020-11-14T02:59:31+05:30 IST