తిరుమల నడకదారి పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ తీరు!
ABN , First Publish Date - 2020-09-28T22:59:52+05:30 IST
తిరుమల నడకదారి పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ తీరు కనిపిస్తోంది.
తిరుపతి : తిరుమల నడకదారి పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ తీరు కనిపిస్తోంది.! తిరుమల కాలిబాటలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్నాటక సత్రాల భూమిపూజలో డిప్యూటీ సీఎంను నిల్చోబెట్టారని దళిత సామాజికవర్గం నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగిన విషయం విదితమే. దీంతో టీటీడీ నష్టనివారణ చర్యలు షురూ చేసింది.
అలిపిరి నుంచి తిరుమలకు రూ.25 కోట్లతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న షెల్టర్లకు డిప్యూటీ సీఎంతో.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి భూమి పూజ చేయించారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన కార్యాలయాన్ని కూడా నారాయణ స్వామే ప్రారంభించారు. టీటీడీ పీఆర్వో విభాగం పేరుతో మీడియా గ్రూపుల్లో రాజకీయ వ్యాఖ్యల ప్రెస్నోట్ వైరల్ అయ్యింది.
ఎందుకిలా..!?
జగన్ డిక్లరేషన్ వివాదంలో అలిపిరి దగ్గర నిరసన తెలిపినందుకు కొవిడ్ నిబంధనలు ఉల్లఘించారని అమర్నాథ్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. అలిపిరి వద్ద ఏ పార్టీ నేతలనూ మీడియాతో మాట్లాడటానికి టీటీడీ సెక్యూరిటీ అంగీకరించలేదు. అయితే.. తిరుమల కాలిబాటలో చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాజకీయ విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒకలా.. ప్రతిపక్షపార్టీ నేతలకు మరోలా రూల్స్ ఉంటాయా..? అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్, అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.