తిరుమలలో నూతన బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-10-12T23:03:30+05:30 IST
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును...
తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
2008వ సంవత్సరం వరకు శ్రీవారి ఆలయంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల లడ్డూలు తయారు చేయడానికి అవసరమైన బూందీ తయారు చేసేవారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బూందీపోటును ఆలయం వెలుపలకు తరలించారు. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండీ, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.10 కోట్ల విరాళంతో నిర్మించిన బూందీ పోటును అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. 40 ఎల్పీజీ స్టౌలు ఏర్పాటు చేసి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని రోజుకు 3.75 లక్షలకు పెంచారు.
ఎల్పీజీ స్టౌల కారణంగా వచ్చే వేడి వల్ల పోటు సిబ్బంది ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన టీటీడీ యాజమాన్యం నూతన బూందీ పోటు నిర్మించాలని నిర్ణయించింది. ఇండియా సిమెంట్స్ అధినేత, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ మరోసారి రూ.12 కోట్ల విరాళంతో 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన పరికరాలతో నూతన బూందీ పోటును నిర్మించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 థర్మిక్ ఫ్లూయిడ్ స్టౌలు, గాలి వెలుతురు బాగా వచ్చే సదుపాయం కల్పించారు. తద్వారా లడ్డూల తయారీ సామర్థ్యం రోజుకు 6 లక్షలకు పెరిగింది. పోటు సిబ్బంది సౌకర్యవంతంగా బూందీ తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది.