ఎంపీల సస్పెన్షన్‌పై భగ్గుమన్న తృణమూల్..

ABN , First Publish Date - 2020-09-21T19:21:25+05:30 IST

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ బిల్లులపై నిరసన...

ఎంపీల సస్పెన్షన్‌పై భగ్గుమన్న తృణమూల్..

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ బిల్లులపై నిరసన తెలిపిన ఎంపీల గొంతునొక్కి బీజేపీ ఏకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ దుయ్యబట్టింది. ‘‘నమ్మశక్యంగా లేదు. నిన్న నిరసన తెలిపిన ఎంపీల గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కిపట్టడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దేశ పౌరులారా... నరేంద్ర మోదీ నియంతృత్వంలోకి పూర్తిగా కూరుకుపోక ముందే  మీ గళం విప్పండి..’’ అని ఆ పార్టీ ట్వీట్ చేసింది. కాగా ఎంపీలను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య నియమాలు, సూత్రాలంటే బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని చెప్పేందుకు ఇదే నిదర్శనం. అయినా మేము ఏమాత్రం మోకరిల్లం. ఈ ఫాసిస్టు ప్రభుత్వంపై పార్లమెంటులోనూ, వీధుల్లోనూ ఎదురొడ్డి పోరాటం సాగిస్తాం..’’ అని మమత పేర్కొన్నారు. 


నిన్న రాజ్యసభలో వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓటింగ్ నిర్వహించకుండా మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులను నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చి స్పీకర్‌ పోడియంపైకి ఎక్కేందుకు యత్నించారు. బిల్లు పత్రాల్ని చించేసి విసిరేశారు. తృణమూల్‌ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ సభా నియమావళి పుస్తకాన్ని చించి  ఉపసభాపతి హరివంశ్‌పైకి విసిరేశారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం తదితరులు సస్పెన్షన్‌కు గురైన వారిలో ఉన్నారు.





Updated Date - 2020-09-21T19:21:25+05:30 IST