గోదారి గట్టుజారిపోతోంది!
ABN , First Publish Date - 2020-10-28T08:08:21+05:30 IST
భారీ వర్షాలకు గోదావరి ఏటిగట్టు పొడవునా పలు చోట్ల అండలు అండలుగా జారింది.
పెరవలి, అక్టోబరు 27 : భారీ వర్షాలకు గోదావరి ఏటిగట్టు పొడవునా పలు చోట్ల అండలు అండలుగా జారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గట్లపై నుంచి నీరు ప్రవహించే క్రమంలో ఏటిగట్టు అక్కడక్కడా ముక్కలైంది. దీంతో మళ్లీ వరదలు వస్తే ఏటిగట్టు పరిస్థితి ఏమిటంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ఆరంభం నుంచి గోదావరి నిండుగా ప్రవహిస్తూనే ఉంది. ప్రతీ రోజూ కొన్ని లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే వానాకాలం ఆరంభంలో మాత్రం ఏ ఒక్కరూ ఏటిగట్టు వైపు చూసిన పాపాన పోలేదు.
పటిష్టత చేపట్టిన దాఖలాలు లేవు.. దీంతో ఈ ఏడాది గోదావరి గట్టుపై ఆరంభం నుంచి గోదావరి పరీవాహన ప్రజలు ఆందోళనలోనే ఉన్నారు. ఒక్క పెరవలి మండల పరిధిలోనే సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర అండలుగా జారినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఏటిగట్టు పటిష్టతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.