‘ఎయిర్ ఇండియా’ కోసం...
ABN , First Publish Date - 2021-09-16T01:38:57+05:30 IST
ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునే యత్నాల్లో భాగంగా... టాటా ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించింది.
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునే యత్నాల్లో భాగంగా... టాటా ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించింది. టాటాతో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినట్లు సపంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిచినపక్షంలో... ఆ సంస్థ మళ్ళీ తన పుట్టింటికి తిరిగి చేరినట్టే అవుతుంది. ఎందుకంటే... 1932 లో టాటా ఎయిర్లైన్స్గా జెఆర్డి టాటా ప్రారంభించిన ఎయిర్లైన్స్ ఆ తరువాత ప్రభుత్వసంస్థ ఎయిర్ ఇండియాగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను వదిలించుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాకు రోజూ రూ. 20 కోట్ల చొప్పున నష్టం వస్తోంది. ఆస్తులపరంగా ఎయిర్ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ... ఇప్పటికే రూ. 60 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని అప్పట్లో కేంద్రం వెల్లడించింది.
ఇదంతా మే ఆఖరు నాటికి పూర్తికావచ్చని తెలిపారు. కాగా... ఎయిర్ ఇండియా కోసం పలు పెద్ద కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం. కాగా... కరోనా నేపధ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం మళ్ళీ వేగంగా అడుగులు వేస్తోంది.