నేటి నుంచి రెండో విడత వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-05-11T05:21:57+05:30 IST
నంద్యాల పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి 1,673 మందికి కొవిషీల్డ్ రెండో డోస్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు.
నంద్యాల, మే 10: నంద్యాల పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి 1,673 మందికి కొవిషీల్డ్ రెండో డోస్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మొదటి డోస్ వేయించుకొని 6 వారాలు దాటిన వారికి పట్టణంలో నాలుగు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి రెండో డోస్ వేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 6 వారాలు దాటిన, మొదటి డోస్ వేయించుకున్న వారికి స్లిప్లను పంచారని, స్లిప్లు ఉన్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలలో రెండో డోస్ వేస్తారని తెలిపారు. 1, 2 వార్డులకు సంబంధించి ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలు, 3, 10, 11, 12, 13వ వార్డులకు సంబంధించి ఆత్మకూరు బస్టాండ్లోని నీళ్ళ ట్యాంక్ వద్ద, 16 నుంచి 22వ వార్డు వరకు నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్లో, 35 నుంచి 42వవార్డు వరకు కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్లో రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. మొత్తం 1,673 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 1650 డోస్లు కేంద్రాలలో సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి డోస్ కొవిడ్ వ్యాక్సిన్ను ఎవరికీ వేయడం లేదని, ప్రజలంతా గమనించాలని ఆయన పేర్కొన్నారు.