నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-06-23T09:52:57+05:30 IST
కుల ధ్రువీకరణపత్రం రద్దు కేసులో మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ, జూన్ 22: కుల ధ్రువీకరణపత్రం రద్దు కేసులో మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్సీ ధ్రువపత్రాన్ని రద్దుచేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆమె మోసపూరితంగా ఎస్సీ ధ్రువపత్రాన్ని పొందారని హైకోర్టు ఆ ధ్రువపత్రాన్ని రద్దుచేస్తూ ఈనెల 8న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం వేసిన సామాజిక కార్యకర్త ఆనంద్రావ్ అద్సులేకు ధర్మాసనం నోటీసు జారీ చేసింది.