పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
ABN , First Publish Date - 2021-12-01T05:29:22+05:30 IST
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పొగాకు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు చెప్పారు.
బోర్డు చైర్మన్ రఘునాథబాబు
పొదిలి, నవంబరు 30 : ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పొగాకు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు చెప్పారు. మంగళవారం పొదిలి పరిసర ప్రాంతాలలో సాగు చేసిన పొగాకు పంటను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టంగుటూరు, కందుకూరు, కనిగిరి ప్రాంతాలలో చేలను పరిశీలించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాలలో ముందుగా పొగాకు నాటడం వల్ల వర్షాలకు పంట దెబ్బతిన్నదన్నారు. ఒంగోలు ప్రాంతంలో డిసెంబర్లో పొగ నారు వేస్తారని చెప్పారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుందన్నారు. పొదిలి పొగాకు వేలం పరిధిలో 3,398 హెక్టార్లలో సాగు చేశారని వర్షాల కారణంగా 330 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని చెప్పారు. కనిగిరి ప్రాంతంలో 1948 హెక్టార్లలో సాగు చేయగా, 240 హెక్టార్లలో నష్టం వాటిల్లిందన్నారు. పొగాకు రైతులను ఆదుకొనే విధంగా డిసెంబర్ 3వ తేదీన గుంటూరులో జరిగే బోర్డు సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కరోనా సమయంలో ప్రధాని పాలనాదక్షత స్పష్టమైందన్నారు. 121 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్వైపు చూస్తున్నాయని చెప్పారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే ప్రగతి సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రఘునాథబాబు చెప్పారు. అనంతరం ఇటీవల మృతి చెందిన బీజేపీ నాయకులు రావూరి సత్యాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. స్థానిక నాయకులు రఘునాథబాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి గిరిరాజుకుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు మాగులూరి రామయ్య, మండల అధ్యక్షుడు మాకినేని అమరసింహం, కొత్తూరి సుబ్బారావు, మువ్వలపార్ధు, చంద్రశేఖర్, కోటిరెడ్డి పాల్గొన్నారు.