నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2022-01-18T06:29:00+05:30 IST

జిల్లావ్యాప్తంగా మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి
ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌

భారీ ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు 

రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహణ

ఒంగోలు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్‌ వర్ధంతిని టీడీపీ శ్రేణులు భారీగానే చేస్తారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక మాదిరిగా జరిగాయి. అయితే ఈసారి వర్ధంతిని గతంలో వలే మళ్లీ భారీగా నిర్వహించేలా ఎక్కడికక్కడ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మండలకేంద్రాలతోపాటు వందలాది గ్రామాల్లో ఈ వేడుకలను భారీఎత్తున నిర్వహించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. అనేకచోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే కొన్నిచోట్ల రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు పాల్గొననున్నారు. దీంతోపాటు వారి పర్యటనకు వీలుగా కొన్నిచోట్ల రాత్రిపూట కూడా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం రెండేళ్లతో పోల్చితే ఈసారి పెద్దఎత్తున వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ఎక్కడికక్కడ పార్టీశ్రేణులు సిద్ధం కావడం కనిపిస్తోంది. 




Updated Date - 2022-01-18T06:29:00+05:30 IST