నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-07-17T08:13:16+05:30 IST

భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం భద్రాచలం వెళ్లనున్నారు.

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • వరంగల్‌ నుంచి రోడ్డు మార్గంలో
  • వరదలపై సీఎం ఏరియల్‌ సర్వే
  • అనంతరం ఏటూరు నాగారంలో..
  • సహాయ చర్యల పర్యవేక్షణ.. సమీక్ష


హైదరాబాద్‌/భద్రాచలం/ఖమ్మం/భూపాలపల్లి/హనుమకొండ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం భద్రాచలం వెళ్లనున్నారు. ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదల వల్ల ప్రజలకు కలిగిన కష్టనష్టాలను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా తెలుసుకుని, అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతోపాటు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, కేసీఆర్‌ శనివారం సాయంత్రమే వరంగల్‌కు చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతో్‌షకుమార్‌ ఉన్నారు. హనుమకొండలోని ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసానికి సీఎం చేరుకోగా.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షాల ప్రభావంపై ఆరా తీశారు. పరీవాహక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాత్రి లక్ష్మీకాంతారావుఇంట్లో సీఎం బస చేశారు. 


ప్రయాణంలో మార్పు..

సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వెళ్లాలని ముందుగా నిర్ణయించగా.. చివరి నిమిషంలో దానిని మార్పు చేశారు. వరంగల్‌ నుంచి కారులోనే భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ కొత్తగూడెం జిల్లాలో హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం భద్రాచలంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆ తరువాత జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లోని గోదావరి తీరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. అనంతరం హెలికాప్టర్‌ నుంచి దిగి.. కాలి నడకన అక్కడి పరిస్థితులు, వరద సహాయక చర్యలను పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు.

Updated Date - 2022-07-17T08:13:16+05:30 IST