అమ్మానాన్నలు దిమ్మెరపోయేలా చేసిన రెండేళ్ల బుడతడు.. ఏం చేశాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-01-24T02:56:29+05:30 IST
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఓ బుడతడు తన తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చాడు. తల్లి ఫోన్తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 2 వేల డాలర్ల(రూ.1.4 లక్షలు) విలువైన ఫర్నీచర్కు ఆర్డరిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఓ బుడతడు తన తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చాడు. తల్లి ఫోన్తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 2 వేల డాలర్ల(రూ.1.4 లక్షలు) విలువైన ఫర్నీచర్కు ఆర్డరిచ్చారు. విషయం తెలిశాక అవాక్కవడం తల్లిదండ్రుల వంతైంది. అన్నట్టు.. ఈ చిన్నోడు మన భారతీయ సంతతికి చెందిన వాడే.. పేరు అయాంశ్ కుమార్. కొత్త ఇంటి కోసం ఏవో కొన్ని సామాన్లు కొనాలని తల్లి అనుకుంటుండగా.. మనోడు అన్నీ ఇంట్లోకి వచ్చేలా చేశాడు.
‘‘మావాడు ఇలాంటి పని చేశాడంటే అస్సలు నమ్మశక్యంగా లేదు’’ అని అయాంశ్ తండ్రి ప్రమోద్ కుమార్ మీడియాకు తెలిపాడు. ఫోన్లోని ఓ యాప్ ద్వారా అయాంశ్ వాల్మార్ట్ నుంచి ఈ ఆర్డర్ పెట్టాడు. ఒక్కో వస్తువు ఇంటికి డెలివరీ అవుతుంటే తల్లిదండ్రులు మొదట దిమ్మెరపోయారు. ఇదంతా ఆ బుజ్జాయే చేశాడని చివరికి తెలిసి కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇంట్లోని పెద్దలంతా మొబైల్ ఫోన్ వాడటం గమనించిన ఆయాంశ్ ఇలా చేసి ఉంటాడని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇకపై మొబైల్లో ఫేస్రికగ్నిషన్తో తెరుచుకునే లాక్ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.