గళాలు పెరుగుతున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-03-22T10:14:17+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఆ ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌పైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రీడలు వచ్చే జూలై 24

గళాలు పెరుగుతున్నాయ్‌!

ఒలింపిక్స్‌ వాయిదాకు డిమాండ్‌

అథ్లెట్లకు సవాల్‌గా పరిస్థితులు

ఐఓసీకి నార్వే లేఖ


ఓస్లో:  కొవిడ్‌-19 వైరస్‌ దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఆ ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌పైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రీడలు వచ్చే జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో జరగాల్సి ఉంది. ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక టోక్యో కమిటీ పదేపదే చెబుతున్నాయి. కానీ చాలా దేశాలు మాత్రం ఒలింపిక్స్‌కు సుముఖంగా లేవు. కుదిరితే మొత్తంగా ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని, అలా సాధ్యం కాకపోతే కనీసం వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. టోక్యో క్రీడలను వాయిదా వేయాలని కొలంబియా, స్లొవేనియా ఒలింపిక్‌ కమిటీలు ఇంతకుముందే కోరాయి. తాజాగా..శనివారం నార్వే కూడా ఆ రెండు దేశాలతో గళం కలిపింది. జూలై 24న ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్‌ను రీషెడ్యూల్‌ చేయాలని నార్వే ఒలింపిక్‌ కమిటీ కోరింది. ఈమేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌కు లేఖ రాసింది. కరోనా వైరస్‌ ధాటికి పలు దేశాలు క్రీడా కార్యక్రమాలను రద్దు చేశాయని, ఈ పరిస్థితి విశ్వవ్యాప్తంగా అథ్లెట్లకు సవాలు విసురుతోందని పేర్కొంది.


నిర్వహణపై చర్చోపచర్చలు

‘వాస్తవానికి మేం విభిన్న దృశ్యాలను పరిశీలిస్తున్నాం. కానీ ప్రపంచంలోని ఇతర క్రీడలకు ఒలింపిక్స్‌ భిన్నం. మాకింకా నాలుగున్నర నెలల సమయముంది’ అని ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ వ్యాఖ్యానించారు. ఇక..ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయమైనా సాధ్యమేనని వరల్డ్‌ అఽథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో అన్నాడు. ఒలింపిక్స్‌ను సెప్టెంబరు లేదా అక్టోబరుకు వాయిదా వేయాలన్న డిమాండ్‌పై అడిగిన ప్రశ్నకు కో ఆ విధంగా స్పందించాడు. ఏడాదిపాటు టోక్యో క్రీడలను వాయిదా వేయాలని అమెరికా ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్‌ కమిటీలు కూడా ఐఓసీకి సూచించాయి. మొత్తంగా ఒలింపిక్స్‌ వాయిదాకే పలు దేశాలు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఐఓసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం.


జపాన్‌కు ఒలింపిక్‌ జ్యోతి..

మరోవైపు ఒలింపిక్‌ జ్యోతి గ్రీస్‌నుంచి జపాన్‌ విచ్చేసింది. టోక్యోకు 250 కి.మీ. దూరంలోని హిగాషిమట్సుషిమాకు శుక్రవారం చేరింది. కరోనా వైరస్‌ భయంతో కొద్దిమంది మాత్రమే ఒలింపిక్‌ జ్యోతిని అందుకొనే కార్యక్రమానికి హాజరయ్యారు. 2011లో సునామీ, భూకంపానికి కకావికలమైన టొహొకొ ప్రాంతంలో ఒలింపిక్‌ జ్యోతి పర్యటించనుంది. అనంతరం ఈనెల 26న జపాన్‌లో అధికారికంగా ప్రారంభమయ్యే టార్చ్‌ రిలేకోసం ఫుకుషిహామ చేరుకుంటుంది. 

Updated Date - 2020-03-22T10:14:17+05:30 IST