రియో రజతం కంటే టోక్యో కాంస్యమే గొప్ప: పీవీ సింధు

ABN , First Publish Date - 2021-08-02T02:10:16+05:30 IST

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 26 ఏళ్ల సింధు

రియో రజతం కంటే టోక్యో కాంస్యమే గొప్ప: పీవీ సింధు

టోక్యో: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్జుకున్న సింధు రజతంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణానికి గురిపెట్టినా నిన్న ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తైజుతో జరిగిన హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. అయితే, నేడు మాత్రం అవకాశాలను జారవిడుచుకోకుండా చక్కని ఆటతీరుతో చైనాకు చెందిన హి బింగ్జియావోను వరుస సెట్లలో ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.  


పతకం సాధించిన అనంతరం సింధు మాట్లాడుతూ.. రియో రజత పతకం కంటే టోక్యో కాంస్య పతకం గొప్పదని పేర్కొంది. కాంస్యం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చిందని చెప్పింది. 2016 రియో ఒలింపిక్స్‌లో తాను పతకం గెలుస్తానని ఎవరికీ పెద్దగా ఆశలు లేవు కాబట్టి తనపై ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడి విజయం సాధించానని వివరించింది. కానీ, ఈసారి తనపై బోల్డన్ని ఆశలు ఉండడం, పేవరెట్‌గా బరిలోకి దిగడంతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.


శనివారం తై జుతో జరిగిన సెమీస్ పోరులో ఓడిన తర్వాత తన మదిలో బోల్డన్ని ఆలోచలు గింగిరాలు తిరిగాయని చెప్పింది. అయితే, వాటన్నింటి పక్కనపెట్టి నేటి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగి పతకం సాధించింది. 


‘‘పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా పడుతున్న కఠోర శ్రమకు ఫలితం ఇది. ఫైనల్ ఆడే అవకాశం చేజార్చుకున్నాక నాలో బోల్డన్ని భావోద్వేగాలు చెలరేగాయి. కాంస్యం గెలిచినందుకు సంతోషించాలా? లేదంటే ఫైనల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయినందుకు బాధపడాలా? మొత్తంగా, నా భావోద్వేగాలను కట్టిపెట్టి అత్యుత్తమమైన ఆటతీరు కనబరిచా. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా బాగా ఆడాను. నా దేశానికి పతకం అందించినందుకు గర్వంగా ఉంది’’ అని సింధు పేర్కొంది. 

Updated Date - 2021-08-02T02:10:16+05:30 IST