టోల్గేట్ అక్రమాలపై డీఎల్పీవో విచారణ
ABN , First Publish Date - 2021-06-22T04:33:15+05:30 IST
మండలంలోని జొన్నవాడ పంచాయతీ టోల్గేట్ అక్రమాలపై డీఎల్పీవో రమేష్ సోమవారం విచారణ చేపట్టారు.
పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 21: మండలంలోని జొన్నవాడ పంచాయతీ టోల్గేట్ అక్రమాలపై డీఎల్పీవో రమేష్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి నారాయణరావు, పాటదారులను విచారించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘టోల్గేట్ వేలంలో అక్రమాలకు తెర’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. అదేవిధంగా అందిన ఫిర్యాదులకు స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టినట్టు డీఎల్పీవో తెలిపారు. విచారణలో వాహనాల వద్ద టోల్ వసూలు చేసే రసీదులను పరిశీలించి అనధికారిక రసీదులుగా గుర్తించారు. నిర్వాహకులు ప్రస్తుత టోల్ వసూలు రసీదు పుస్తకాలు పరిశీలనకు చూపించకపోవడంతో పాటు నిర్ధేఽశించిన వసూళ్లకు మించి వసూలు చేయడాన్ని తప్పపడుతూ పాట రద్దుకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఇసుక రీచ్ వద్ద టోల్ వసూలు దండకాలకు ఎవరు అనుమతి ఇచ్చారని కార్యదర్శిని, నిర్వాహకులను ప్రశ్నిస్తూ మినగల్లు రీచ్ నుంచి వచ్చే ఇసుక వాహనాల వద్ద వసూలు చేయడానికి వీల్లేదంటూ వెంటనే నిలిపివేయాలని కార్యదర్శిని ఆదేశించారు. ఈ క్రమంలో పంచాయతీ టోల్గేటు పాట నిర్వహణకు సంబంధించిన రికార్డుల కోసం డీఎల్పీవో 2.30గంటల పాటు నిరీక్షించినా రికార్డులు చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు ఎంపీడీవో, ఈవోపీఆర్డీ దగ్గర ఉన్నాయని చెప్పడమేంటని ఆయన విస్తుపోయారు. ఈ మేరకు కార్యదర్శి తప్పిదాలు టోల్ వేలం నిర్వహణలో అవకతవకలపై కార్యదర్శి వద్ద స్టేట్మెంట్ తీసుకుని తదుపరి చర్యలు నిమిత్తం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.