డేటింగ్‌ యాప్‌లో టాలీవుడ్ నటి ఫొటోలు...!

ABN , First Publish Date - 2021-05-27T14:11:04+05:30 IST

హాట్‌లైవ్‌ అనే డేటింగ్‌ వెబ్‌సైట్‌లో...

డేటింగ్‌ యాప్‌లో టాలీవుడ్ నటి ఫొటోలు...!

  • సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు


హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : సినీనటి గీతాంజలీ తస్యాకు పోకిరీల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హాట్‌లైవ్‌ అనే డేటింగ్‌ వెబ్‌సైట్‌లో తనకు తెలియకుండా తన ఫొటోలు పెట్టారని, తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలిసిందని, ఇప్పటికే సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు తెలిసిందని, సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి గీతాంజలీ తస్యా మంగళవారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 509 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, హాట్‌లైవ్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌ గురించి ప్రాథమికంగా ఆరాతీసామని, అది చైనాకు చెందిన యాప్‌ అని తెలిసిందని ఏసీపీ చెప్పారు. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పనేనని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 


డేటింగ్‌ యాప్స్‌ను రూపొందించి వాటి ద్వారా సెలబ్రిటీలు, ప్రముఖుల కుటుంబాలకు చెందిన యువతులు, సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌లో కూడా అందంగా ఉండే అమ్మాయిల ఫొటోలు, వివరాలు కాపీ చేసి ఇలా సైబర్‌నేరగాళ్లు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ సొమ్ముచేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి డేటింగ్‌ యాప్స్‌ ఎక్కువ రోజులు ఉండవని, తరచూ యాప్స్‌ను మారుస్తూ సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఒకే యాప్‌ ఎక్కువ కాలం అందుబాటులో ఉన్న పక్షంలో తాము పోలీసులకు దొరికిపోతామన్న భయంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.


ఇదిలా ఉండగా.. ఇలాంటి వెబ్‌సైట్స్‌, మొబైల్‌ యాప్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాటిని నిషేధించాలని గీతాంజలి తస్యా అన్నారు. బుధవారం ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వృత్తి పరంగా కొంతమంది పడనివాళ్లు, కంటగింపుతో ఉండేవాళ్లు, ప్రత్యర్థులు ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయడానికి, మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం సహజమేనని, అయితే తాను సైబర్‌క్రైమ్స్‌లో ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని, నిందితులను గుర్తించి శిక్షించాలని కోరినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2021-05-27T14:11:04+05:30 IST