Tollywood డ్రగ్స్ కేసు విచారణలో దూకుడు.. ఎలా కొన్నారు? ఎవరికిచ్చారు?.. 31 నుంచి ఏం జరుగుతుందో.. ఆ వెబ్సైట్ సంగతేంటి..!?
ABN , First Publish Date - 2021-08-28T13:31:53+05:30 IST
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ..
- ఎలా కొన్నారు? ఎవరికిచ్చారు? కోణంలో ఈడీ ప్రశ్నలు
- ఈ నెల 31 నుంచి సినీ ప్రముఖుల విచారణ
హైదరాబాద్ సిటీ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో నిందితులను ఈడీ వేర్వేరుగా విచారించింది. డ్రగ్స్ను ఎలా కొన్నారు..? ఎవరికిచ్చారు..? నగదు లావాదేవీలు ఎలా జరిగాయి..? తదితర కోణాల్లో ప్రశ్నించింది. నిందితుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించింది. విదేశాల నుంచి డార్క్వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ విచారణలో నిందితులు వెల్లడించారు. దీని కోసం హవాలా మార్గంలో డబ్బును చెల్లించినట్టు అంగీకరించారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఎఫ్ క్లబ్కు పెద్దమొత్తంలో డ్రగ్స్ను సరఫరా చేశామని చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ తదితరులకు నోటీసులు జారీ చేసింది.