దిగువ మానేరు జలాశయంలో టోర్నడో
ABN , First Publish Date - 2021-10-17T05:08:48+05:30 IST
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూర్ గ్రామ శివారులోని దిగువ మానేరు జలాశయంలో అరుదైన దృశ్యం కనిపించింది.
తిమ్మాపూర్, అక్టోబరు 16: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూర్ గ్రామ శివారులోని దిగువ మానేరు జలాశయంలో అరుదైన దృశ్యం కనిపించింది. వచ్చునూర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అక్కడికి సమీపంలోని దిగువ మానేరు జలాశయంలో ఒక్కసారిగా సుడిగాలిలా ప్రారంభమై నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. దిగువ మానేరు జలాశయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండో సారి. ఐదు సంవత్సరాల క్రితం 2016 జూలై 31న కరీంనగర్ సమీపంలో దిగువ మానేరు జలాశయం మధ్యలో ఇలాంటి టోర్నడో కనిపించింది. అప్పుడు చేపల వేటకు వెళ్ళిన మత్య్స కారులు చూసి భయాందోళనకు గురై జలాశయం నుంచి తీరాని వచ్చారు. శనివారం వచ్చునూరు సమీపంలోని టొర్నడోను చూసిన గ్రామస్థులు ఆందోళన గురయ్యారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలు పరుగులు తీశారు. దాదాపు 30 నిమిపాలపాటు జలాశయంలోని నీరు ఆకాశంలోకి వెళ్లినట్లు వచ్చునూర్ గ్రామ సర్పంచ్ ఉప్పులేటి ఉమారాణి తెలిపారు.