Kerala: మళ్లీ కరోనా కలవరం..50లక్షలకు చేరువలో కేసులు

ABN , First Publish Date - 2021-10-08T18:17:12+05:30 IST

కేరళ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.కేరళలో గడచిన 24 గంటల్లో 99,312 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 12,288మందికి పాజిటివ్ అని తేలింది....

Kerala: మళ్లీ కరోనా కలవరం..50లక్షలకు చేరువలో కేసులు

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.కేరళలో గడచిన 24 గంటల్లో 99,312 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 12,288మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా సోకిన వారిలో 10,271 మంది రెండు డోసుల టీకాలు వేయించుకున్నారని వైద్యాధికారుల పరిశీలనలో వెల్లడైంది. 3,270 మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని వారికి తాజాగా కరోనా సోకిందని వైద్యాధికారులు చెప్పారు. కేరళలో ప్రస్థుతం 1,18,744 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రోగుల్లో 10.7 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారని వెల్లడైంది. మొత్తంమీద కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 50 లక్షల మందికి చేరువలో ఉంది. 


కేరళలో ఇప్పటివరకు మొత్తం 47,76,311 మందికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. కరోనా వైరస్ సోకడం వల్ల కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 25,952 మంది మరణించారని వైద్యఆరోగ్యశాఖ రికార్డులే చెబుతున్నాయి. కేరళలో 3,77128 మంది కరోనా అనుమానంతో పరిశీలనలో ఉన్నారు. అందులో 3,62,444మంది హోం క్వారంటైన్ లో , 14,684 మంది ఆసుపత్రుల్లో ఐసోలేషన్ లో ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.కేరళ జనాభాలో 93.16 శాతం మంది సింగిల్ డోస్ కొవిడ్ టీకా తీసుకున్నారు. మొత్తం జనాభాలో 43.14 శాతం అంటే 1,15,23,278 మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యాధికారులు చెప్పారు. 


Updated Date - 2021-10-08T18:17:12+05:30 IST