chennai: అన్ని గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు
ABN , First Publish Date - 2021-10-21T14:45:32+05:30 IST
భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి అవగాహనా ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండో దశ ఒప్పంద
- భారత్ నెట్ రెండో దశ ఒప్పందం ఖరారు
- త్వరలోనే తమిళ్ నెట్
- మంత్రి మనోజ్ తంగరాజ్ వెల్లడి
అడయార్(chennai): భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి అవగాహనా ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండో దశ ఒప్పంద పత్రాలపై మంత్రి మనోజ్ తంగరాజ్ సమక్షంలో రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, భారత్ నెట్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇదే విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న 12525 గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే నిమిత్తం ప్యాకేజ్-3, 4 పథకం పనులను తక్షణం ప్రారంభించినట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ముంగిటకే ప్రభుత్వ సేవలతో పాటు గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేలా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా బీపీవో సెంటర్ నడిపేందుకు అవసరమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయొచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఐడీఐ, ప్రైవేటు సంస్థ అయిన ఎల్ అండ్ టిల మధ్య ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందం విలువ రూ.1715 కోట్లని చెప్పారు. ఈ ఒప్పందాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజన చేయడం జరిగిందన్నారు. మొదటి, రెండు ప్యాకేజీల అమలుపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందన్నారు. అందుకే మూడు, నాలుగు ప్యాకేజీలను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి మనోజ్ తంగరాజ్ వెల్లడించారు.