టూరిజంలోనూ ‘దుకాణం’
ABN , First Publish Date - 2021-06-24T08:46:37+05:30 IST
దశలవారీ మద్య నిషేధం అంటే ఏంటి? విడతల వారీగా షాపులు తగ్గించడం! కానీ విచిత్రమైన పేర్లతో విలాసవంతంగా కొత్త రకం మద్యం షాపులను అందుబాటులోకి తెస్తే దాన్ని ఏమనాలి? దాని ఉద్దేశం, లోగుట్టు వైసీపీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి
మందుపై మరింత రాబడే లక్ష్యంగా టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లు
వంద సెంటర్లు పెడుతున్న సర్కారు
ప్రీమియం సరుకు మాత్రమే విక్రయం
భారీగా లాభాలు పిండుకునేందుకేనా?
నిన్న మద్యంమాల్స్..ఇప్పుడు కొత్తగా సెంటర్లు
సర్కారీ ‘మద్యనిషేధం’ తీరుపై అనుమానాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దశలవారీ మద్య నిషేధం అంటే ఏంటి? విడతల వారీగా షాపులు తగ్గించడం! కానీ విచిత్రమైన పేర్లతో విలాసవంతంగా కొత్త రకం మద్యం షాపులను అందుబాటులోకి తెస్తే దాన్ని ఏమనాలి? దాని ఉద్దేశం, లోగుట్టు వైసీపీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. నిన్న మద్యం మాల్స్! ఇప్పుడు టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లు (టీఎ్ఫసీ)! పేరు ఏదైనా వీలైనంత ఎక్కువ మద్యం అమ్మడమే ఎక్సైజ్ శాఖ లక్ష్యం. ఎంత ఎక్కువ అమ్మితే అంత ఆదాయం అన్న లక్ష్యంగా ఈ శాఖ అడుగులు వేస్తోంది. కొత్తగా పర్యాటక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు పెంచేందుకు పెడుతున్న టీఎ్ఫసీల నుంచీ మరింత ఆదాయం రాబట్టుకొనేందుకు సిద్ధమవుతోంది. దీనిపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధంచేయగా, కొద్దికాలం కిందట ఎక్సైజ్ అనుమతులు మంజూరుచేసింది. తాజాగా విశాఖ సహా మరికొన్ని నగరాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వంద సెంటర్లు ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం టూరిజం శాఖకు అద్దె చెల్లించనున్నట్లు ఎక్సైజ్శాఖ వర్గాలు తెలిపాయి. గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.17500 కోట్ల ఆదాయం మద్యం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని రూ.20వేల కోట్లు దాటించే విధంగా బడ్జెట్లో అంచనాలు వేసిన ప్రభుత్వం, ఇప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది.
ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం వాకిన్ సెంటర్ల పేరుతో మద్యం మాల్స్ ఏర్పాటుచేసింది. ఖరీదైన బ్రాండ్లు కొనేవారు క్యూ లైన్లలో నిలబడేందుకు ఇబ్బందిపడుతున్నారన్న ఉద్దేశంతో ఈ మాల్స్ తెచ్చింది. సాధారణ షాపుల్లో ఫలానా బ్రాండ్ కావాలని అడిగితే ఇస్తారు. కానీ మాల్స్లో లోపలికి వెళ్లి కావాల్సిన సీసాలు తెచ్చుకుంటే బిల్లు వేస్తారు. వాటిని కూడా స్టార్ హోటళ్లు ఉండే ప్రాంతాల్లో అత్యధిక అద్దెలు చెల్లిస్తూ ఎక్సైజ్ శాఖ ఏర్పాటుచేసింది. సుమారు 80 వాకిన్ సెంటర్లకు అనుమతివ్వగా, అనేక నగరాల్లో వీటిని ఏర్పాటుచేసింది. అసలు మద్య నిషేధం చేసే రాష్ర్టానికి ఇలాంటి విలావంతమైన మద్యం షాపులు పెట్టాల్సిన అవసరం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం పైకి దశలవారీ నిషేధం అని చెబుతున్నా లోలోపల ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టిపెట్టింది. సర్కారీ మద్యం షాపులు ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయని నిబంధనలు రూపొందించి, దాన్ని ఇటీవల అనధికారికంగా గంట పెంచింది. రాత్రి తొమ్మిది గంటలవరకు మద్యం విక్రయిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి గరిష్ఠంగా మూడు సీసాలే అమ్మాలన్న నిబంధనను కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారుల నుంచి షాపుల్లో పనిచేసే సిబ్బందికి అనధికారికంగా ఆదేశాలు అందుతున్నాయి.