కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తెలంగాణ తల్లి బందీ: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-07T21:48:34+05:30 IST

తెలంగాణ తల్లి సోనియమ్మనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తెలంగాణ తల్లి బందీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ తల్లి సోనియమ్మనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ఇంట్లో సోనియా పటం ఉండాలన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. మోదీ, కేసీఆర్‌ వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవన్నారు. కరోనా కంటే మోదీ, కేసీఆర్‌ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మోదీ, కేసీఆర్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 


కేసీఆర్‌ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ కుటుంబమేనని, తెలంగాణను కేసీఆర్‌ దోచుకుంటున్నాడని రేవంత్ అన్నారు. తెలంగాణలో మారీచుడు, రావణాసురుడు కేసీఆర్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో తెలంగాణ తల్లీ బందీ అయిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్‌ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని, పాదరసంలాంటి  కార్యకర్తలే తమకు పీకేలు అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు... ఏకే-47 తూటాలని.. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత చూపించాలన్నారు.

Updated Date - 2021-07-07T21:48:34+05:30 IST