ఒక ప్రాజెక్టుకు ఎమ్మెస్సార్ పేరు పెట్టాలి: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-05-07T09:48:46+05:30 IST
దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) పేరును ఒక ప్రాజెక్టు లేదా పథకానికి పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) పేరును ఒక ప్రాజెక్టు లేదా పథకానికి పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు తాను లేఖ రాయనున్నట్లు తెలిపారు. గురువారం జూమ్లో జరిగిన ఎమ్మెస్సార్ సంతాపసభలో మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన మహా మనిషి ఎమ్మెస్సార్ అని కొనియాడారు. ఆయన తెలంగాణకే గర్వకారణమన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎమ్మెస్సార్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన వద్ద కార్యదర్శిగా పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. మంచి ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తి ఎమ్మెస్సార్ అని, కాంగ్రెస్ అధికారంలోకొస్తే నక్సలైట్లతో చర్చలు జరపాలన్న ప్రతిపాదన ఆయనదేనని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.