సిటీలో ట్రాక్ లెస్ ట్రామ్
ABN , First Publish Date - 2020-06-04T09:06:08+05:30 IST
విశాఖపట్నంలో ప్రజా రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలుతో పాటు ‘ట్రాక్ లెస్ ట్రామ్’ని కూడా నడపాలని ..
4 రూట్లు, 60.2 కిలోమీటర్లు
డీపీఆర్ తయారీ బాధ్యత యుఎంటీసీ ఎంపిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ప్రజా రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలుతో పాటు ‘ట్రాక్ లెస్ ట్రామ్’ని కూడా నడపాలని నిర్ణయించింది. నాలుగు రూట్లలో నడిచే ఈ రైలు కోసం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలు అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ (యుఎంటీఎస్) కంపెనీకి అప్పగించింది.
ఏయే మార్గాల్లో అంటే...?
ట్రాక్ లెస్ ట్రామ్ని నాలుగు రూట్లలో 60.2 కి.మీ. పొడవున వేయాలని ప్రతిపాదించారు.
ఎన్ఏడీ జంక్షన్-పెందుర్తి వరకు 10.2 కి.మీ.
గాజువాక-స్టీల్ప్లాంట్-అనకాపల్లి వరకు 18.2 కి.మీ.
పాత పోస్టాఫీసు-రుషికొండ వరకు 15.4 కి.మీ.
రుషికొండ-భీమిలి బీచ్ 16.4 కి.మీ.
గతంలో ఏమి జరిగిందంటే..?
గతంలో మెట్రో రైలు మార్గం మూడు కారిడార్లలో 46.4 కి.మీ. పొడవున వేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న నేపథ్యంలో అక్కడి వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. గాజువాక నుంచి కొమ్మాది వరకు వేయాలనుకున్న 34.23 కి.మీ. ట్రాక్ను 67.74 కి.మీ. వరకు పొడిగించారు. అంటే మొదటి దశలో చేపట్టబోయే పనులు 46.4 కి.మీ. నుంచి 79.91 కి.మీ.కు పెరిగాయి. ఈ నిర్మాణం పూర్తయిన తరువాతే ట్రాక్ లెస్ ట్రామ్ను రెండు, మూడు దశల్లో చేపడతారు.