HYD : రిజిస్ట్రేషన్ కాక ముందే ట్రాక్టర్ మాయం!
ABN , First Publish Date - 2021-07-25T16:36:26+05:30 IST
అలాంటి ట్రాక్టర్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
- బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి తస్కరణ
- పోలీసులకు అధికారుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్ : సాక్షాత్తూ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ నుంచే ఓ ట్రాక్టర్ చోరీకి గురయింది.. ఏడాది కిందట కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు ఇంకా నంబర్ కూడా రాలేదు. నేటికీ టీఆర్ నంబర్తోనే నడుస్తోంది. అలాంటి ట్రాక్టర్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బడంగ్పేట్ కార్పొరేషన్లో వివిధ పనుల నిమిత్తం గతేడాది సెప్టెంబరులో పలు కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. వాటిల్లో ఓ ట్రాక్టర్కు ఇంకా రిజిస్ర్టేషన్ కాలేదు. ‘టీఆర్’ నంబరుతోనే పని కానిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీ రాత్రి కార్యాలయం ముందు దానిని పార్క్ చేయగా, మరుసటి రోజు ఉదయానికల్లా మాయమయింది. శనివారం మునిసిపల్ అధికారులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడంగ్పేట్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ చోరీ నెల క్రితమే జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అధికారులు దానిని రహస్యంగా ఉంచి ఇప్పటిదాకా వెతికించారు. ఎక్కడా దొరకకపోవడంతో తాజాగా పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.