నగరంలో ట్రా‘ఫికర్’
ABN , First Publish Date - 2021-12-19T16:01:58+05:30 IST
నగరంలో శనివారం ట్రాఫిక్ పోటెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వర కు పలు రహదారుల్లో అంతంతగా కనిపించిన ట్రాఫిక్.. తర్వాత నుంచి విపరీతమైంది. సికింద్రాబాద్ నుంచి...
హైదరాబాద్ సిటీ: నగరంలో శనివారం ట్రాఫిక్ పోటెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వర కు పలు రహదారుల్లో అంతంతగా కనిపించిన ట్రాఫిక్.. తర్వాత నుంచి విపరీతమైంది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్, సాగర్ రింగ్రోడ్డు వరకు.. ఏ మార్గంలో చూసినా వాహనాల రద్దీనే కనిపించింది. మధ్యాహ్నం 12 తర్వాత మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, జేఎన్టీయూ, పంజాగుట్ట, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో ప్రారంభమైన ట్రాఫిక్ రాత్రి 10గంటల వరకు కొనసాగినట్టు వాహనదారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, గచ్చిబౌలి, హైటెక్సిటీ, రాయదుర్గం, టోలీచౌకి, ఆబిడ్స్, కోఠి, మోజాంజాహి మార్కెట్, ఎల్బీనగర్, సాగర్ రింగ్రోడ్డు, ఉప్పల్, ట్యాంక్బండ్ వైపున ట్రాఫిక్ విపరీతంగా కనిపించింది.
క్రిస్మస్ పండుగతోపాటు శనివారం వీకెండ్ కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు షాపింగ్ చేసేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పలు ప్రాంతాల్లో వీఐపీల కార్యక్రమాలుండడంతో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వీఐపీల కాన్వాయ్ వెళ్లేవరకు రోడ్డుకు రెండు వైపులా వాహనాలను ఆపివేయడంతో ఆయా చోట్ల దాదాపు అరగంటకుపైగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో అమీర్పేట్ నుంచి జేఎన్టీయూ వరకు ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది.