అడుగడుగునా ట్రాఫిక్ జామ్!
ABN , First Publish Date - 2021-01-16T05:01:08+05:30 IST
జిల్లాలో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. నిత్యం వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులకు నిరీక్షణ తప్పడం లేదు.
వంతెనల వద్ద పరిస్థితి మరీ దారుణం
వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని వినతి
(విజయనగరం, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. నిత్యం వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులకు నిరీక్షణ తప్పడం లేదు. జనాభా, వాహనాలు పెరుగుతున్న స్థాయిలో రోడ్లు వెడల్పు, వంతె నల వద్ద ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి ట్రాఫిక్ జామ్ అవుతుండగా రోజురోజుకూ ఈ సమస్య మరింత జటిల మవుతోంది. సీతానగరం సమీపంలోని సువర్ణముఖి వంతెన వద్ద పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది.. గత వారం రోజులుగా ఇక్కడ వాహనాలు బారులు దీరుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి సొంత వాహనాలపై స్వగ్రామాలకు వచ్చేవారు , స్థానికులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుం టున్నారు. రామభద్రపురం-బొబ్బిలి మధ్య ఉన్న వేగావతి నది వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు పర్యవేక్షణలో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నా.. నిరీక్షణ మాత్రం తప్పడం లేదు.. ఎదురెదురుగా వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం ఉన్న రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.