యుముడికే షాకిచ్చిన బుడతడు.. మీది నుంచి రైలు దూసుకెళ్లినా..!

ABN , First Publish Date - 2020-09-24T18:37:11+05:30 IST

రైలు కింద పడిన రెండేళ్ల ఓ బుడతడు క్షేమంగా తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు...

యుముడికే షాకిచ్చిన బుడతడు.. మీది నుంచి రైలు దూసుకెళ్లినా..!

ఆగ్రా: రైలు కింద పడిన రెండేళ్ల ఓ బుడతడు క్షేమంగా తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. తన మీదినుంచి రైలు దూసుకెళ్లినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాగఢ్‌ రైల్వే స్టే‌షన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూమూలు రోజుల్లో కూడా అంతగా రద్దీ లేని ఈ స్టేషన్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పెద్దగా రైళ్లు తిరగడం లేదు. దీంతో రెండేళ్ల ఓ పిల్లాడు, 14 ఏళ్ల తన అన్నతో కలిసి స్టేషన్‌లో పట్టాలపై ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ-ఆగ్రా రైలు అటుగా వచ్చింది. రైలును చూసి అన్న పక్కకు పారిపోగా రెండేళ్ల పిల్లాడు పట్టాలపైనే చిక్కుకున్నాడు. లోకోపైలట్ అతడిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా.. అప్పటికే రైలు అతడి మీది నుంచి దూసుకెళ్లి కొంత దూరంలో ఆగింది. దీంతో లోకోపైలట్ దీవాన్ సింగ్, ఆయన అసిస్టెంట్ అతుల్ ఆనంద్ భయంభయంగా రైలు దిగి బాలుడి కోసం వెతికారు. తీరా రైలు కింద చూస్తే పిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నారు. ‘‘పిల్లాడు సజీవంగా బయట పడడాన్ని నిజంగా నమ్మలేకపోయాం. చిన్నగాయం కూడా కాకుండా అతడు బయటపడడం ఆశ్చర్యంగా అనిపించింది..’’ అని దీవాన్ పేర్కొన్నారు.


కాగా ఈ ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకో పైలట్లు కిందికి దిగి అతడి అన్నను పట్టుకోగా.. పిల్లాడి తల్లి ఏడుస్తూ అక్కిడికి పరుగున వచ్చినట్టు కనిపిస్తోంది. లోకోపైలట్, ఆయన అసిస్టెంట్ ఇద్దరూ ఆ చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. ‘‘బాలుడు ఇంజిన్ మధ్యలో ఇరుక్కోవడంతో బయటికి తీసుకురావడం అంత సులభం కాలేదు. దీంతో ముందు అతడిని కంగారు పడొద్దని వారించి, తర్వాత ఆ ప్రమాదకరమైన ప్రదేశం నుంచి నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి తల్లికి అప్పగించాం..’’ అని ఆగ్రా డివిజన్ రైల్వేస్ కమర్షియల్ మేనేజర్ శ్రీవాస్తవ వెల్లడించారు. 

Updated Date - 2020-09-24T18:37:11+05:30 IST