హెచ్‌ఎంలు, పండిట్ల బదిలీలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-01-19T06:34:21+05:30 IST

టీచర్ల బదిలీల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఉన్న తెలుగు, హిందీ, సంస్కృత పండిట్ల బదిలీలు నిలిచిపోయాయి.

హెచ్‌ఎంలు, పండిట్ల బదిలీలకు బ్రేక్‌

ఖాళీలను చూపలేదంటూ కోర్టును ఆశ్రయించిన పండిట్లు

26 వరకు ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం


 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : టీచర్ల బదిలీల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఉన్న తెలుగు, హిందీ, సంస్కృత పండిట్ల బదిలీలు నిలిచిపోయాయి. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు 120 మంది వరకు ఉండగా, పండిట్లు వెయ్యి మందికి పైగా ఉన్నారు. పండిట్ల బదిలీలకు సంబంధించి ఈనెల 26వ తేదీ వరకు మళ్లీ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. 


పదోన్నతి ఇచ్చినా ఖాళీలు చూపలేదు

గతంలో తెలుగు, హిందీ, సంస్కృత పండిట్లకు పదోన్నతులు ఇచ్చారు. అయితే ఆ ఖాళీలను ప్రస్తుత బదిలీల్లో చూపలేదు. దీంతో కొందరు పండిట్లు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు పదోన్నతులు ఇచ్చిన పండిట్ల పోస్టులను ఖాళీలుగా చూపి, అప్పుడు  బదిలీలు చేపట్టాలని సూచించింది. కాగా ఇందుకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఎత్తివేసేలా పిటీషన్లు వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి డీఈవోలకు ఆదేశాలు వచ్చాయి. డీఈవోలు కోర్టులో పిటీషన్‌ వేయగా, పదోన్నతులు ఇచ్చిన పండిట్ల పోస్టులను ఖాళీలుగా చూపిన తరువాతే బదిలీలు నిర్వహించాలని కోర్టు మళ్లీ సూచించింది. పండిట్ల బదిలీలకు సంబంధించి ఈనెల 26 వరకు మళ్లీ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించడంతో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు టీచర్లు సిద్ధమవుతున్నారు. ఐదు సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి ప్రధానోపాధ్యా యులకు, పండిట్లకు బదిలీలు నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-01-19T06:34:21+05:30 IST