వలసదారులకు Kuwait సర్కారు అలెర్ట్.. దేశంలోకి అడుగు పెట్టాలంటే..
ABN , First Publish Date - 2021-08-27T19:57:56+05:30 IST
వలసదారులకు కువైత్ సర్కార్ తాజాగా కీలక సూచన చేసింది.
కువైత్ సిటీ: వలసదారులకు కువైత్ సర్కార్ తాజాగా కీలక సూచన చేసింది. కువైత్కు వచ్చే జీసీసీ పౌరులతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆయా దేశాల్లో జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను అప్డేట్ చేసుకోవాలని ఆ దేశ ఆరోగ్యశాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నిర్వహణ సమాచార వ్యవస్థ డైరెక్టర్ అహ్మద్ అల్ గరీబ్ ప్రకటన విడుదల చేశారు. దీనికోసం పర్యాటకులు కువైత్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన 'ఇమ్యూన్ యాప్'ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ యాప్లో సందర్శకులు ఇంతకుముందు ఉపయోగించిన తమ పాస్పోర్ట్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కువైత్లో ప్రవేశానికి ముందే యాప్ను అప్డేట్ చేసుకుంటే ఎంట్రీ సమయంలో ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. కనుక పర్యాటకులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇమ్యూన్ యాప్ అప్డేటెడ్ వర్షన్ ద్వారా వినియోగదారులు చాలా సులువుగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సమాచారం, కోవిడ్-19 టెస్టు ఫలితాన్ని అనుసంధానం చేసుకోవచ్చని కువైత్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కువైత్ సమాచార వ్యవస్థ ఈ యాప్ను అభివృద్ధి చేసింది. కువైత్ పౌరులు ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటారో వారికి ఆ దేశ ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఈ యాప్ను వినియోగిస్తోంది. ఇది పూర్తిగా ఉచితమైన యాప్. ఇక వలసదారులు కువైత్లోకి అడుగు పెట్టాలంటే ఈ యాప్ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి.