బండరాళ్ల కింద నిధి!
ABN , First Publish Date - 2021-04-09T08:46:28+05:30 IST
అది వ్యవసాయ భూమి. రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం యంత్రాలతో చదును చేస్తుండగా భూమి లోపల నుంచి శబ్దం వినిపించింది.
వెంచర్ కోసం సాగుభూమి చదును చేస్తుండగా రాగి బిందె లభ్యం
అందులో 18.9 తులాల బంగారం.. 1.2 కిలోల వెండి ఆభరణాలు
జనగామ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): అది వ్యవసాయ భూమి. రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం యంత్రాలతో చదును చేస్తుండగా భూమి లోపల నుంచి శబ్దం వినిపించింది. చూస్తే అదో రాగిబిందె. ఆ బిందెలో 18.9 తులాల బంగారు, 1.2 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి! జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలో గురువారం ఈ ఘటన స్థానికుల్లో ఆసక్తి రేపింది. పెంబర్తికి చెందిన రైతులు 11.2 ఎకరాల భూమిని కీసర మండలం బోగారానికి చెందిన వారికి అమ్మారు. ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం గురువారం ఎక్స్కవేటర్తో బండరాళ్లను తొలగిస్తుండగా రాగిబిందె కనిపించింది. భూమి యజమాని నర్సింహ సర్పంచ్కు సమాచారం ఇచ్చారు. ఆ బిందెలో బంగారు చెవి కమ్మలు, పుస్తెలు, వెండి కాలిపట్టీలు ఇతర ఆభరణాలు కనిపించాయి.
అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఏసీపీ వినోద్కుమార్ ఇతర అధికారులు అక్కడికి వచ్చి రాగిబిందెను సీజ్ చేసి ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖ అధికారులు వచ్చి బిందెను పరిశీలించారు. రాగిబిందె బరువు 1.7 కిలోలు ఉందని, అందులోని ఆభరణాల విలువ రూ.9.5 లక్షల దాకా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ఆభరణాలు 1940 కాలానికి చెందినవని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) రామునాయక్ తెలిపారు.
ఆభరణాల తీరును బట్టి అవి పురాతన కాలానికి చెందినవి కావని తెలుస్తోందని, బహుశా ప్రైవేటు వ్యక్తులు తమ సొత్తును రక్షించుకునేందుకు భూమిలో పాతిపెట్టి ఉండవచ్చునని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏమిటంటే.. రాగి బిందెను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చినా దాన్ని ముట్టుకునేందుకు జంకారు. గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత నర్సింహ దాన్ని తాకారు.