బీజేపీకి త్రిపుర ఓటర్ల ఝలక్
ABN , First Publish Date - 2021-04-11T06:51:10+05:30 IST
త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. మొత్తం 28 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఆవిర్భవించిన టిప్రా(ది ఇండిజీనోస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయెన్స్) 18 స్థానాల్లో
- గిరిజనమండలి ఎన్నికల్లో ఘోర పరాజయం?
- భారీ ఆధిక్యంలో కొత్త పార్టీ ‘టిప్రా’
అగర్తల, ఏప్రిల్ 10: త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. మొత్తం 28 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఆవిర్భవించిన టిప్రా(ది ఇండిజీనోస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయెన్స్) 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ, దాని మిత్రపక్షాలు కేవలం ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ గిరిజన మండలి మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. రాష్ట్ర జనాభా 40 లక్షలు ఉండగా, అందులో మూడో వంతు మంది ఈ గిరిజన మండలి పరిధిలోనే ఉన్నారు. ఇందులో మొత్తం 30 సీట్లు ఉండగా, రెండు సీట్లకు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. మిగిలిన 28 సీట్లకు ఈనెల 6న ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 16 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2015లో గిరిజన మండలి ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 25 స్థానాల్లో గెలుపొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన మండలి పరిధిలోని 20 నియోజకవర్గాలకుగాను 18 నియోజకవర్గాల్లో బీజేపీ-ఐపీఎ్ఫటీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మూడేళ్లకే బీజేపీ కూటమి ఇక్కడ భారీ ఓటమిని మూటగట్టుకుంటోంది.