‘టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనకు గ్రేటర్ ఎన్నికలే నిదర్శనం’
ABN , First Publish Date - 2020-12-04T20:09:23+05:30 IST
ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే నిదర్శనమని టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు.
హైదరాబాద్: ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే నిదర్శనమని టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో... మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఒక్కటిగా గ్రేటర్ ఎన్నికల్లో పనిచేశాయని.. అయినా ప్రజలు మతత్వాలకు స్థానమివ్వకుండా.. అభివృద్దికే ఓట్లు వేశారని అన్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించామని, ఈసారి వందకు పైగా స్థానాలు గెలుస్తామని టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. కాగా టీఆర్ఎస్ 67, బీజేపీ 37, ఎంఐఎం 28, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.