టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి చుక్కలు చూపించిన ఓటర్లు

ABN , First Publish Date - 2020-11-22T19:05:59+05:30 IST

మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ల కోసం ప్రజలు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు వచ్చిన మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు యాప్రాల్ ప్రజలు చుక్కలు చూపించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి చుక్కలు చూపించిన ఓటర్లు

హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ల కోసం ప్రజలు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు వచ్చిన మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు యాప్రాల్ ప్రజలు చుక్కలు చూపించారు. ‘నో రోడ్స్.. నో ఓట్స్’, ‘రోడ్డు వేయండి.. ఓటు అడగండి’ అనే ప్లకార్డులతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన సెగ తగలడంతో ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానంటూ తన లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి మరీ ఎమ్మెల్యే మైనంపల్లి వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా తలపై చేయివేసుకుని ప్రమాణం కూడా చేశారు. దీంతో ఓటర్లు శాంతించారు. సొంత నిధులు అవసరం లేదని, జీహెచ్ఎంసీకి తాము ట్యాక్స్‌లు కడుతున్నామని, ప్రజాధనంతోనే తమకు రోడ్లు వేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తానని మైనంపల్లి హనుమంత రావు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-22T19:05:59+05:30 IST