టీఆర్ఎస్ నాయకుడి హత్యకు కుట్ర?
ABN , First Publish Date - 2020-12-01T05:05:16+05:30 IST
భద్రాచలం పట్టణ టీఆర్ఎస్ నాయకుడు నర్రా రాముతో పాటు అతని కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది.
ఇంటిచుట్టూ విద్యుత్ తీగలు అమర్చిన గుర్తు తెలియని వ్యక్తులు
పరిశీలించిన క్లూస్ టీం
విచారణ చేపట్టిన సీఐ స్వామి
భద్రాచలం, నవంబరు 30: భద్రాచలం పట్టణ టీఆర్ఎస్ నాయకుడు నర్రా రాముతో పాటు అతని కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది. సోమవారం రాము నిద్రలేచి తన ఇంటి తలుపులు తీసే క్రమంలో విద్యుత్తు వైర్లు ఉండటం అవి నీళ్లల్లో, ఇంటిపైన ట్యాంకులో, ఇంటి చుట్టూ అమర్చి ఉండటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తేరుకున్న ఆయన ఈ విషయాన్ని భద్రాచలం పోలీసుల దృష్టికి వెంటనే తీసుకొచ్చారు. దీంతో భద్రాచలం సీఐ టి.స్వామి తమ సిబ్బందితో రాము ఇంటికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ సమయంలో ఆయన వెంట ట్రాన్స్కో అధికారులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వైర్లు ఇంటి చుట్టూర, ఇంటిపైన ట్యాంకులో ఏర్పాటు చేయడాన్ని విచారించారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో మరింత వివరాలను సేకరించేందుకు క్లూస్టీం కూడా భద్రాచలం చేరుకొని వివరాలను సేకరించింది. కాగా పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.స్వామి ఆంధ్రజ్యోతికి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే ప్రఽథమం కావడంతో పట్టణంలో రామును నాయకులు పరామర్శించారు.