తగ్గేదేలే అంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

ABN , First Publish Date - 2021-08-01T21:52:31+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శక్తి ఏ మాత్రం తగ్గలేదని మరోసారి

తగ్గేదేలే అంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శక్తి ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ట్రంప్‌ మద్దతుదారులు రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ కంట్రోల్ చేస్తున్న, ట్రంప్‌కు చెందిన ఫండ్‌రైజింగ్ కమిటీలకు 56 మిలియన్ డాలర్ల(రూ. 416.52 కోట్లు)కు పైగా విరాళాలిచ్చారు. ‘‘ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కమిటీ’ అనే కమిటీ రిపబ్లికన్ పార్టీ కోసం విరాళాలను సేకరిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు ఈ కమిటీకు 34 మిలియన్ డాలర్ల(రూ. 252.88 కోట్లు)కు పైగా విరాళాలు వచ్చాయి. మరోపక్క ట్రంప్ సొంత ఫండ్ రైజింగ్ కమిటీలు అన్నీ కలుపుకుని 22 మిలియన్ డాలర్ల(రూ. 163.63 కోట్లు)కు పైగా సేకరించాయి. 


ఈ విరాళాలు మొత్తం ఆన్‌లైన్ ద్వారానే రాగా.. 50 డాలర్ల కంటే తక్కువగా విరాళాలిచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రిపబ్లికన్ పార్టీలోని ట్రంప్ వ్యతిరేకులు మొత్తం ఈ విరాళాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. పార్టీలో ట్రంప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని వారంతా గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. 2024 అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్ మరోమారు పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయినప్పటికి రిపబ్లికన్ పార్టీలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ట్రంప్ ఉండటం విశేషం.

Updated Date - 2021-08-01T21:52:31+05:30 IST