వ్యవస్థలపై విశ్వాసం పెంచాలి
ABN , First Publish Date - 2020-03-19T08:44:45+05:30 IST
‘రంజన చెడి’ అంటూ తెనాలి రామకృష్ణుడు పూరించిన సమస్య కాదు లెండి. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇప్పుడు ప్రవేశం చేస్తున్న పెద్దల సభలో సడి గురించి నా అభిప్రాయం ఇది..
‘రంజన చెడి’ అంటూ తెనాలి రామకృష్ణుడు పూరించిన సమస్య కాదు లెండి. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇప్పుడు ప్రవేశం చేస్తున్న పెద్దల సభలో సడి గురించి నా అభిప్రాయం ఇది.. నవంబర్లో రిటైర్ అయిన ఆయన ఆరు నెలలు తిరగక ముందే రాజ్యసభ సభ్యుడయ్యారు. ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ జరిగీ జరగ్గానే ప్రభుత్వం నుండి ‘ఫేవర్’ పొందడం ఎంతవరకూ కరెక్ట్ అన్నదే ఇక్కడ ప్రశ్న? ఆయన సుప్రీం జడ్జిగా ఉండగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పత్రికలకెక్కారు. సొంత వ్యవస్థలోని లోపాల్ని ధైర్యంగా బయటపెట్టారు ‘అబ్బో... ఎంత నిజాయితీ పరులో...!’ అని చాలా మంది సంతోషించారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పలు ముఖ్యమైన కేసుల్ని పరిష్కరించారు. అందులో నేటి పాలకపక్షపు ప్రభుత్వమే కక్షిదారు. ప్రభుత్వం గానీ, ప్రభుత్వంలోని పెద్దలు గానీ ఇబ్బందిపడేలా తీర్పులేవీ రాలేదు. పైపెచ్చు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే వచ్చాయి. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అనంతర నియామకంతో ఆ తీర్పుల్ని ప్రజలు చూసే దృష్టి మారుతుంది. వద్దన్నా సందేహాలు వస్తుంటాయి. ఆయన లేవనెత్తిన న్యాయవ్యవస్థలోని పక్షపాత వైఖరి పట్ల ఇప్పుడు ఇంకా బలంగా అనుమానాలొస్తుంటాయి. కాబట్టి, ఈ తరహా వ్యక్తిగత ప్రయోజనాలకు న్యాయమూర్తులను గానీ, మరికొన్ని రాజ్యాంగ సంస్థల అధిపతులను గానీ అనర్హులుగా చేయాలి. అప్పుడే ఆయా వ్యవస్థలపై ప్రజల నమ్మకం నిలబడుతుంది. సంపూర్ణ విశ్వాసం ఉండాల్సిన వ్యవస్థలో సందేహాలుండే వాతావరణం మంచిది కాదు.
డా.డి.వి.జి.శంకరరావు
మాజీ ఎంపీ, పార్వతీపురం