టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా : ఈవో సింఘాల్
ABN , First Publish Date - 2020-08-09T19:25:08+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకూ 743
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకూ 743 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని.. ఇప్పటి వరకూ 400 మంది కరోనాను జయించి నగరంలోని పలు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ఇంకా కొవిడ్ కేంద్రాల్లో 338 మంది చికిత్స పొందుతున్నారని సింఘాల్ మీడియాకు వెల్లడించారు. కోవిడ్తో ఐదుగురు టీటీడీ ఉద్యోగులు మృతి చెందారు.
సీరియస్గానే స్పందిస్తాం..!
‘ గత నెల హుండీ ఆదాయం 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా 3 కోట్లు ఆదాయం వచ్చింది. టీటీడీ వార్షిక బడ్జెట్ 3200 కోట్లు. ఇందులో 1350 కోట్ల రూపాయలు జీతాలకు అవుతుంది. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా ఇప్పుడు నెలకు 150 నుంచి 200 కోట్ల రూపాయలు అవుతోంది. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి నిధులు తీసుకోవటం లేదు. భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు నెలాఖరు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ లాక్ నిబందనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా?. భక్తుల భాగస్వామ్య ఉండాలా..? అనే అంశంపై టీటీడీ పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటాం. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు మాతో చర్చించలేదు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా మేము సీరియస్గానే స్పందిస్తాం. ఇప్పటి వరకు పాజిటీవ్ వచ్చిన అర్చకుల్లో ఎక్కువ మంది తిరిగి డ్యూటీలకు అటెండ్ అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధానార్చకులకు చెప్పాం. అర్చకులను ఇబ్బందికి గురిచేసి దర్శనాలు చేయించాలనే ఆలోచన టీటీడీకి లేదు’ అని ఈవో అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు.