80 మంది అయితే ఏంటి, 100మంది అయితే ఏంటి?
ABN , First Publish Date - 2021-09-18T09:06:39+05:30 IST
80 మంది అయితే ఏంటి, 100మంది అయితే ఏంటి?
టీటీడీ జంబో బోర్డుపై మల్లాడి వ్యాఖ్య
పాలకమండలి సభ్యునిగా కృష్ణారావు, నందకుమార్ ప్రమాణస్వీకారం
తిరుమల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘సేవచేసుకునేందుకు 80 మందైతే ఏంటి, వంద మందైతే ఏంటి.. శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పుడు 80 మంది సభ్యులు బోర్డులో ఉంటే తప్పేముంది. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉంటే ఎంతమంది సభ్యులున్నా అభ్యంతరాలు ఉండవనుకుంటున్నా’ అని పుదుచ్చేరి మాజీ మంత్రి, యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మఽధ్యాహ్నం టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి దాదాపు 32 ఏళ్లు ఎన్నో రాజకీయ పదవులు అనుభవించినప్పటికీ, టీటీడీ బోర్డు సభ్యుడిగా శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అవకాశం కల్పించిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తమిళనాడులోని వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్ కూడా శుక్రవారం శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ జేఈవో సదాభార్గవి వీరిరువురితో ప్రమాణస్వీకారం చేయించారు.