అత్యంత పొడవైన టీ-49 సొరంగం తవ్వకం పూర్తి
ABN , First Publish Date - 2022-02-17T07:34:55+05:30 IST
జమ్మూకశ్మీర్లోని 12.758 కిలోమీటర్ల దూరం కలిగిన టీ-49 సొరంగంలో బ్రేక్త్రూను సాధించామని భారత రైల్వే తాజాగా ప్రకటించింది.....
శ్రీనగర్, ఫిబ్రవరి 16: జమ్మూకశ్మీర్లోని 12.758 కిలోమీటర్ల దూరం కలిగిన టీ-49 సొరంగంలో బ్రేక్త్రూను సాధించామని భారత రైల్వే తాజాగా ప్రకటించింది. ఇరువైపులా మొదలైన తవ్వకం పనులు, ఒకదానికొకటి కలిసి, తవ్వకం ముగిస్తే బ్రేక్ త్రూగా చెబుతారు. ఇది సాధించడంతో.. ఇక రైల్వే ట్రాక్ సంబంధిత పనులనూ వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం రికార్డు ఇప్పటి వరకూ పీర్ పంజల్ (11.2 కిలోమీటర్లు) పేరిట ఉండగా.. పూర్తైన అనంతరం టీ-49 అతి పెద్ద రైల్వే సొరంగంగా చరిత్ర సృష్టించనుంది. సుమారు 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది సుంబెర్, అర్పించల స్టేషన్లను కలుపుతుంది. ఇక.. టీ-49 సొరంగంలో ఒకటి ప్రధానమైనది కాగా.. దాని పక్కనే మరో సొరంగాన్ని(ఎస్కేప్ టనెల్) కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా సొరంగంలో ఊహించని ఘటన జరిగితే.. వెంటనే సహాయం అందించేందుకు ఈ రెండో సొరంగాన్ని వాడతారు.